అందువలన విశ్వ వస్త్ర సృష్టి కర్తగను, విశ్వ వస్త్ర ప్రదాతగను, విశ్వ వస్త్ర నిర్మాణ ప్రదాత గాను దేవాంగః అను దానితో పాటు మానవాంగః, విశ్వ జనాంగః అని పరి విధములుగా కీర్తింప వచ్చును...
ఆ తరువాత దేవలుడు తన నిజ పట్టణమైన ఆమోద పట్టణమునకు వచ్చి తన పట్టణములో వున్న జనులందరకు వస్త్రములు ఇచ్చినాడు, ఇచ్చట దేవలుని విశాల భావము శ్లాఘనీయముగా వున్నది...
ఎందువలనంటే అన్ని ప్రాంతములు, సకల జనులకు వస్త్రములను ఇచ్చి సంతోష పరచిన తరువాతనే తను పాలించు ప్రాంత జనులకు వస్త్ర ప్రదానము చేసినాడు, అందరి సంతోషములోనే తన సంతోషము ఉన్నది అను భావనకు ఇది చిహ్నముగా భావించ వచ్చును...
దేవలుడు వస్త్రములు ఇవ్వగా ఆమోద పట్టణ వాసులు, మంత్రులు, బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మరియు ఇతర జాతుల వారును ప్రీతితో వస్త్రములను ధరించి రాజ శ్రేష్టుడగు దేవాంగ ముని వలన మిక్కిలి సంతోషము పొందితిమి అని భావించినారు...
మహా బుద్ది కుశలత కలిగి వుండి సకల సంపదలచేత తులతూగుతున్న దేవాంగ మునీశ్వరుడు ధర్మబుద్ధి కలిగిన వాడైనందున ఈ ప్రకారముగా మూడు లోకముల వారికి దోవతులు, చీరలు ఇచ్చి ఎల్లవారి అభిమానమును కాపాడినాడు, వారందరు సంతోషముగా నుండవలెనను మనస్సు గలవాడు అయినందున మిక్కిలి కీర్తిని పొందినాడు...
దేవలుడు దేవతలందరికి వస్త్రములను ఇచ్చినాడు, దేవలుడు ఇచ్చిన వస్త్రములను తమ శరీరమునకు ధరింపజేసి అలంకారముగా కనపడిరి, దేవతల శరీర అంగములు దేవలుని దివ్య వస్త్రములతో అలంకరింప బడినందున ఆ అలంకారినికి దేవలుడే మూల కారకుడు కాబట్టి దేవలున్ని దేవాంగుడు అని పిలిచినారు...
మానవ జాతి మొత్తానికి దేవలుడు తాను నేసిన వస్త్రములను వారు కోరిన విధముగా వివిధ వన్నెలతోను,చిత్రవిచిత్ర వర్ణములతోను కూడివుండిన వస్త్రములు జంబూ ద్వీపము మొదలగు నవ విధ ద్వీపములలో నున్న మానవ జాతి మొత్తానికి ఇచ్చినాడు...
ఈ మానవ జాతి మొత్తము దేవలునిచే ఇవ్వబడిన వస్త్రములను తమ శరీరమునకు అలంకరించుకొని తమ నగ్నత్వమును పారద్రోలినారు, వారు నూతన దివ్య వస్త్రములతో అలంకరించుకొనుట వలన వారి శరీరములు మిక్కిలి అందముగా కనబడినవి...
అందువలన మానవ అంగాలను తన వస్త్రముతోటి అలంకరింప జేయుట వలన దేవలున్ని మానవాంగః లేదా మానవాంగుడు అని కొనియాడవచ్చును...
ఈ సృష్టిలో సకల జాతుల వారందరికీ అనగా దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలగు దేవజాతుల వారికే గాక మానవ, నాగ, రాక్షస జాతుల వారికి కూడా అనగా ఈ సృష్టిలో సమస్త జాతుల వారికి దివ్య వస్త్రములు నేసి వారి దగ్గరకు వెళ్లి, స్వయముగా వస్త్రములు ఇచ్చినాడు, వారందరి చేత ధరింపజేసినాడు...
సృష్టిలో వున్న దిగంబరత్వమును పారద్రోలినాడు, విశ్వములోని వారందరి అంగములు {శరీర అవయవములను} ను తన వస్త్రముల చేత అలంకరింపబడుట వలన దేవలున్ని విశ్వాంగః విశ్వాంగుడు అని విశ్వ వస్త్ర ప్రదాత అని కొనియాడ వచ్చును...
ఈ విధముగా దేవలునికి దేవాంగః, మానవాంగః, విశ్వాంగః అని మూడు విధములైన ప్రఖ్యాత నామములు ఉన్నప్పటికి ఈ మూడు పేర్లలో ఏది తగినదిగా వున్నదని ఆలోచించగా రాక్షసులకన్నా మానవులు ఉన్నతులు...
మానవులకన్నా దేవతలు ఉన్నతులు, పుణ్యాత్ములు, కావున అధిక పుణ్యాత్ములు దివ్య స్వరూపులైన దేవతలకే ఇచ్చుట వలనను, మానవులు, దానవులు వారితో సరితూగలేరు కాబట్టి దేవాంగః దేవాంగుడు అని పిలవబడుటయే సముచితముగా వున్నది...
అంతేకాకుండా శివుడు కూడా ప్రప్రథమః దేవాంగుడు అని అతని నోటి నుంచి మాట వచ్చినది, కావున దేవలున్ని దేవాంగుడు అని పిలువబడుటయే సముచితముగా ఉన్నది, దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వస్త్రములను ఇచ్చుట ద్వారా ఈ దేవల ముని ప్రపంచ వ్యాప్త జనుల గౌరవము పొందినాడు...
కావున దేవల చరిత్ర విశ్వములోని సకల జాతుల వారికి సంబంధించిన చరిత్రగా గుర్తింపవలయును, దేవాంగుడు అని పిలువబడినప్పటికి అందరికి సంబంధించిన వాడు అని తేటతెల్లమగుచున్నది, విశ్వ నాగరికతకు పునాదులు వేసిన వాడు అయినవాడు దేవాంగుడు...